Wednesday 2 January 2019

కళింగ పౌరుషం ( kalinga pourusham) ప్రోత్సాహక బహుమతి పొందిన చారిత్రక కధ -జాగృతి వారపత్రిక

కళింగ పౌరుషం

కళింగ పౌరుషం
క్రీ.పూ. 261వ సంవత్సరం. మగధ సామ్రాజ్య ప్రాభవం ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్న కాలంలో ఓ మిట్ట మధ్యాహ్న సమయం. భోరున కురుస్తున్న వర్షానికి అడవిదారులన్నీ నీటితో నిండి ఉన్నాయి. జోరున వీస్తున్న గాలికి చెట్లన్నీ పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉన్నాయి. సేనాదత్తుడు ఆ వర్షాన్ని, గాలిని లెక్కచేయకుండా అశ్వాన్ని వేగంగా తమ రాజ్యం వైపు దౌడు తీయిస్తున్నాడు. అశ్వం అతడి అభీష్టానికి అనుగుణంగా అడవి మార్గంలోని నీటిగుంటలను దాటుకుంటూ, విరిగిపడిన చెట్లకొమ్మలమీంచి లాఘవంగా ఎగురుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. సేనాదత్తుడు కళింగరాజ్యం  గూఢాచారి. మగధ సామ్రాజ్యంలోకి వర్తక వ్యాపారిగా మారువేషంలో ప్రవేశించాడు. పలు ప్రాంతాలలో సంచరించి, గుబులు రేకెత్తించే రహస్యాలను ఛేదించి, నిర్ధారించుకున్నాడు. అంతే… మగధ సామ్రాజ్యాధి నేత అశోకుడు తమ రాజ్యంపై పన్నుతున్న కుట్రకు, వెన్నులో సన్నగా వణుకుపుట్టింది. తమ రాజ్యానికి ముంచుకొస్తున్న పెనుముప్పును ఊహించి, చిగురు టాకులా వణికిపోయాడు. కళింగ ప్రజలకు రాబోయే కష్టాలను తలచుకుని తల్లడిల్లాడు. ఈ కుట్ర విషయం తమ ప్రభువు చెవినవేసి, రాజ్యాన్ని అప్రమత్తం చేయాలని తలంచాడు. తక్షణమే బయలుదేరాడు.
అశ్వం శరవేగంగా పరుగులు తీస్తోంది. ఆ దట్టమైన అడవిలో అక్కడక్కడా కనిపించే క్రూరమగాలను అవలీలగా తప్పించుకుంటూ వెళ్తోంది. ‘ఈ అడవి దాటితే చిన్నపాములను తిని కొండచిలువలా బలిసిన మగధ సామ్రాజ్యం ముగుస్తుంది. సహజసిద్ధమైన ఎత్తైన కొండలూ, గలగల పారే నదులతో శత్రుదుర్భేద్యమైన తమ కళింగ రాజ్యం ఆరంభమౌతుంది. అటు తర్వాత నిర్భయంగా కళింగకోటకు చేరుకోవచ్చు. తమ ప్రభువుకు, అశోకుడి కుయుక్తిని చేరవేయవచ్చు’ అనుకుంటూ సేనాదత్తుడు అశ్వాన్ని మరింత వేగంగా దౌడు తీయిస్తున్నాడు.
అంతలో అతడిని రహస్యంగా వెంబడిస్తున్న మగధ సామ్రాజ్యపు సరిహద్దు కాపాలాదార్లు వదిలిన బాణాలు, అతడి వీపును తూట్లు పొడిచాయి. అతడు అశ్వాన్ని వేగంగా దౌడు తీయిస్తూ, కిందకు ఒరిగి పోయాడు. అతడి దేహం విసురుగా నేలను తాకింది. అశ్వం వాయువేగంతో ముందుకు దూసుకు పోయింది.
భోరున కురుస్తున్న ఆ వర్షంలో సేనాదత్తుడు ఆఖరి శ్వాస తీసుకుంటూ ‘ఓ బుద్ధదేవా!… మగధ సామ్రాజ్యపు బలిష్టమైన కబంధ హస్తాలలో నా కళింగ రాజ్యం నలిగిపోకుండా రక్షించు. సకల జనులను నీవు ఉపదేశించిన శాంతిమార్గం వైపు నడిపించు’ స్వగతంగా అనుకుంటూ ప్రాణాలు విడిచాడు.
—– —— —– —–
ఆ రాత్రి కళింగ ప్రజలు రాబోయే ప్రమాదం గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తెల్లవారడానికి ఇంకా కొన్ని ఘడియలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి వర్షం పూర్తిగా తెరిపినిచ్చింది.
రాజధానికి యోజనం దూరంలో ఉన్న పల్లెలోని ఓ గహంలో సేనాదత్తుడి సోదరుడు వజ్రమిత్ర, తన భార్యతో కలిసి గాఢనిద్రలో ఉన్నాడు. అతడికి రెండు మాసాల క్రితమే వివాహమయింది. వ్యవసాయం అతడి వత్తి. యుద్ధ విద్యలంటే అమితాసక్తి. దాంతో అతడు రెండింటిలోనూ ఆరితేరిన ధీశాలి!
అశ్వం సకిలింపులకు ఠక్కున మెలకువ వచ్చింది వజ్రమిత్రకు. బద్ధకంగా శయ్య మీద నుంచి లేచి, బయటకొచ్చాడు. సేనాదత్తుడి అశ్వం, వజ్రమిత్రను చూడగానే సకిలించడం ఆపింది. ఒంటరి అశ్వాన్ని చూసి, వజ్రమిత్ర నివ్వెరపోతూ, అన్నయ్యకోసం చుట్టూ చూశాడు. ఎక్కడా జాడ కానరాక కలత చెందుతూ ఉండగా అశ్వానికంటిన నెత్తుటి చారికలు లీలగా కనిపించాయి. అతడికి వెంటనే తన సోదరుడికేదో ప్రమాదం వాటిల్లిందని అర్థమయ్యి, బాధగా మూలిగాడు. అకస్మాత్తుగా అతడి దష్టి అశ్వం కళ్లెంపై పడింది. సేనాదత్తుడు రహస్య సమాచా రాలను తోలు మీద రాసి ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని కళ్లెంలో ఓ చోట భద్రపరుస్తాడు. ఆ విషయం వజ్రమిత్రకు తెలుసు. అతడు అనుకున్నట్టే, రహస్య సమాచారం కనిపించింది. ఆత్రుతగా తీసి చదివాడు. మరుక్షణం మ్రాన్పడి పోయాడు.
మూడులక్షల కాల్బలం, ఎనభైవేల అశ్వికదళం, తొమ్మిదివేల గజబలం, రెండువేల రథికులతో మగధ సామ్రాజ్యధినేత అశోకుడు కళింగరాజ్యంపై మెరుపుదాడి చేయబోతున్నాడు. సేనాదత్తుడు రాసిన ఆ చేదునిజం వజ్రమిత్రను భయకంపితుణ్ణి చేసింది. స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న కళింగ ప్రజలకు కష్టకాలం సమీపించబోతున్నదని విలపించాడు. ‘అశోకుడి కుయుక్తిని ఛేదించిన అన్నయ్య శ్లాఘనీయుడు. అతడి సాహసాన్ని వథా పోనివ్వకూడదు. తక్షణమే ఈ సమాచారాన్ని తమ ప్రభువుకు చేరవేయాలి. రాజ్యభక్షకుల విషపు కోరల నుంచి రాజ్యాన్ని రక్షించాలి!’ అనుకుంటూ ఉన్నఫలంగా రాజధానికి బయలుదేరాడు.
—– —— —– —–
సభా మందిరం నిశ్చేష్టితమై ఉంది. కళింగరాజు, మహామంత్రి, సర్వసేనాధిపతి, వజ్రమిత్ర, దళపతులు, ఆస్థాన పండితులు, రాజ్యాధికారులు, వివిధ జనపదాల నుంచి విచ్చేసిన పెద్దలూ, ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసి ఉన్నా ఏ ఒక్కరి నోరూ పెగలడం లేదు. రాబోయే ఘోరవిపత్తు నుంచి తప్పించుకోవడమెలాగో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
అరవీర భయంకరుడైన అశోకుడి గురించి అక్కడున్న వారందరికీ తెలుసు… తన తండ్రి బిందుసారుడి అభీష్టం ప్రకారం సుసీముడుకి దక్కాల్సిన రాజ్యాన్ని మంత్రి రాధాగుప్తుడి సాయంతో ఏవిధంగా హస్తగతం చేసుకున్నదీ తెలుసు. పదవీ వ్యామోహంతో తన సోదరులందరినీ రాక్షసంగా, అతిక్రూరంగా చంపించిన విషయమూ తెలుసు… రాజ్యకాంక్షతో పొరుగు రాజ్యాలన్నిటినీ తన సేనల కర్కశ పదఘట్టనలతో నలిపేస్తున్న సంగతీ తెలుసు… వరుస విజయాలతో కన్నూమిన్నూగానక ఘీంక రిస్తున్న మదపుటేనుగనీ తెలుసు… తెలుసు కాబట్టే అక్కడున్న వారందరికీ మతులుపోయి ఉన్నాయి. భయమూ ఆందోళనా ఆపాదమస్తకం ఆవహించి ఉన్నాయి.
అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ కళింగరాజు గొంతువిప్పాడు. ‘ఆ చండాశోకుడి పన్నాగం సేనాదత్తుడి సాహసం వల్ల బయటపడింది. ప్రళయ జంఝామారుతం వంటి ఆ అశోకుడి సేనను తట్టుకుని ఎదురునిలిచే ఉపాయం ఆలోచించండి. మౌనముద్రను వీడి మన కళింగసీమను కాపాడే మార్గాన్ని అన్వేషించండి’ అన్నాడు.
మహామంత్రి తన ఆసనం మీదనుంచి నెమ్మదిగా లేచి ‘ప్రభూ… అశోకుడి పర్జన్య విలయ గర్జనలకు అనేక రాజ్యాలు కకావికలమైనాయి. అతడి పేరు వింటే చాలు రాజ్యాలకు రాజ్యాలే చిగురుటాకులా వణికిపోతున్నాయి. అపజయమెరుగని అతడి శౌర్య పరాక్రమానికి భీతిల్లి దాసోహమంటున్నాయి..’
ఆ మాటలకు అడ్డు తగిలాడు సర్వసేనాధిపతి. మహామంత్రి మాటలను ఖండిస్తూ ‘అమాత్యులవారు సభకు పిరికిమందు నూరిపోయడం భావ్యం కాదు. అసమాన ధైర్యసాహసాలు కలిగిన మన కళింగ సైన్యం ధాటికి, ఇంతకుపూర్వం కయ్యానికి కాలు దువ్విన బిందుసారుడు, తోకముడిచిన విషయం, బహుశా అమాత్యులవారు మరిచినట్టున్నారు’ అన్నాడు.
‘మరువలేదు సేనాని.. కాని అప్పటి మగధ సేన ఇప్పుడు మూడింతలైంది. అశోకుడి నాయకత్వంలో మరింత పదునుదేలింది. కాని మన సేన అప్పటికీ ఇప్పటికీ సంఖ్యాపరంగా అంతే ఉంది. అదీగాక యుద్ధానికి సన్నద్ధంగా లేని మనం, యుద్ధాన్ని అభిలషించటం వథా ప్రయాస! కొరివితో తల గోక్కోవడం క్షేమదాయకం కాదన్నది నా అభిమతం!’ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు మహామంత్రి.
‘అంటే, కళింగరాజ్యాన్ని అశోకుడి పాదాక్రాంతం చేద్దామంటారు. మన ప్రభువుల వారిని మగధకు సామంతరాజును చేద్దామంటారు. కళింగ సైన్యాన్నీ, ప్రజలను బానిసలను చేద్దామంటారు. అంతేనా అమాత్యా!’
‘సేనాని… ఆవేశం అనర్థదాయకం. నిదానంగా ఆలోచించు… యావత్‌ భారతాన్ని గడగడలాడిస్తున్న అశోకుడి ముందు మన బలం, బలగం ఏమాత్రం సరిపోదన్న సత్యం బోధపడుతుంది. సైన్యాన్నీ, ప్రజలను బలిపెట్టడం తప్ప, యుద్ధం వల్ల ఎట్టి ప్రయోజనమూ లేదు. కాలం కలిసివచ్చేవరకూ తగ్గి ఉండడమే శ్రేయస్కరం’
వజ్రమిత్ర సభ ముందుకొచ్చి ‘ప్రభూ…కళింగ సైన్యమూ, కళింగ ప్రజలు చావుకి భయపడే పిరికిపందలు కారు. వారు స్వతంత్ర జీవనాన్ని కోరుకునే అభిమానవంతులు. పరాయి పాలనలో బానిసలుగా బ్రతకడం కంటే పోరాడి చావడానికైనా సిద్ధపడే ధీరులు. తమ మట్టిని కాపాడుకోవడం కోసం, ఆ మట్టిలో కలిసిపోవడానికైనా వెనుకాడని సాహసవీరులు. ప్రభూ… తమరు ఆజ్ఞాపించాలేగానీ యుద్ధ విద్యలలో ఆరితేరిన మన కళింగ ప్రజలు జీత భత్యాలతో ప్రమేయం లేకుండా మహదా నందంగా సైన్యంలో చేరతారు. ఇప్పుడున్న మన సైన్యాన్ని తక్షణమే పదింతలు చేస్తారు. వారు ప్రచండ వాయువులై, కమ్ముకొచ్చే కారు మేఘాలను చెల్లా చెదురు చేస్తారు. ఆనకట్టలై, దూసుకొచ్చే జల ప్రళయాన్ని అడ్డుకుంటారు. అంకుశాలై, మదపు టేనుగుల మదం అణుస్తారు’ అన్నాడు ఆవేశంగా.
ఆ వెంటనే ఓ వద్ధుడు లేచి ‘ప్రభూ… వజ్రమిత్ర చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. తమరు అనుమతిస్తే యుద్ధవిద్యను అభ్యసించిన నా ముగ్గురు కుమారులను సైన్యంలో చేరుస్తాను. తాటాకు చప్పుళ్లకు భయపడకండి. కళింగరాజ్యం జోలికొస్తే పరాభవం తప్పదని ఆ అశోకుడికి గట్టి హెచ్చరిక చేయండి’ అన్నాడు.
సభలో ఉన్నవారంతా సర్వసేనాధిపతి, వజ్రమిత్ర, వద్ధుడు అన్న మాటలను గట్టిగా బలపరిచారు. మాతభూమి పరిరక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ముక్తకంఠంతో నినదించారు.
కళింగరాజు అందరినీ శాంతింపజేసి ‘మీ అందరిలోనూ కళింగపౌరుషం ఉట్టిపడుతోంది. కోపాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆ జ్వాలలు రాజ్యమంతా ప్రజ్వరిల్లితే మగధ సైన్యం కాలి బూడిదవుతుంది. గడ్డిపరకలన్నీ ఏకమైతే మదగజాన్ని బంధించగలవు. మన కళింగ వీరులంతా దీక్షబూనితే ఆ చండాశోకుడి దురహంకారాన్నీ, నిరంకుశత్వాన్ని మట్టిలో కలపొచ్చు. తక్షణమే యుద్ధానికి సన్నద్ధం కండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. మనపై కత్తి దూస్తున్న వారి కుత్తుకలను ఖండించో, స్వేచ్ఛా స్వతంత్య్రం కోసం పోరాడి నేలరాలో చరిత్ర పుటల్లో నిలిచిపోదాం’ అన్నాడు ఉగ్రంగా.
ఆ సభలో ఉన్న వారందరినీ యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు. ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించే బాధ్యతను వజ్రమిత్రకు అప్పగించి, సభ ముగించాడు.
—– —— —– —–
కళింగరాజు తనపై వేసిన భారాన్ని సమర్థ వంతంగా నిర్వర్తించాడు వజ్రమిత్ర. దీక్షాబద్ధులైన రెండువందల మంది యువకుల సహాయంతో, అశోకుడి దండయాత్ర వార్త కళింగరాజ్యమంతా వ్యాపింపజేశాడు. ప్రజలలో పోరాట స్ఫూర్తిని రగిలించాడు. దాంతో అందరిలోనూ రాజ్యాభి మానం, ఆత్మాభిమానం పెల్లుబికింది. మగధ సామ్రాజ్యంపై ఆవేశం, ఆగ్రహం కట్టలు త్రెంచుకుంది. రాజ్యంలోని రహదారులన్నీ పోరాట వీరులతో కిక్కిరిసి పోయాయి. సైన్యంలో చేరడానికి ఆయుధాలు చేతబూని కొందరు, సైన్యానికి సహాయం అందించడానికీ, ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని తమ విరాళాలతో ముంచెత్తడానికి మరికొందరు వెల్లువలా రాజధానికి సాగుతున్నారు. చావో రేవో తేల్చుకోవ డానికి వీరావేశంతో ముందుకు కదులుతున్నారు.
ఎప్పటికప్పుడు వేగుల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుంటున్న కళింగరాజు మహదానందంగా ఉన్నాడు. ఘడియ ఘడియకు సైన్యం బలోపేత మవుతున్న విషయం, సర్వసేనాధిపతి నోటివెంట విని ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు. అంతలో ఓ వేగు తెచ్చిన సమాచారం అతడిని స్థాణువుడిని చేసింది. అఖండమైన సైన్యంతో అశోకుడు కళింగ రాజ్యంలోకి దౌర్జన్యంగా చొరబడ్డాడన్న ఆ వార్త, కాస్త ఆందోళన కలిగించింది. నైరాశ్యాన్ని తెప్పించింది. వెంటనే మహామంత్రిని పిలిపించి సమాలోచనలు జరిపాడు.
‘మహామంత్రి… మగధసేనను మనసేన ఢీకొట్టగలదా? అన్న శంక నన్ను పట్టిపీడిస్తున్నది. కళింగ ప్రజల ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి మనం యుద్ధానికి దిగడం న్యాయమా?’ సందిగ్ధంగా అడిగాడు కళింగరాజు.
‘మహారాజా…. ఒక్కసారి ఏకాంత మందిరం వీడి బయటకు రండి. జనసముద్రాన్ని చూస్తే, నా లాగే తమరి శంక కూడా పటాపంచలవుతుంది. వజ్రమిత్ర ప్రజలలో రగిలించిన స్వేచ్ఛా స్వాతంత్య్ర జ్వాల తమరికి తేటతెల్లమవుతుంది. ప్రజలు అగ్గి బరాటాల్లా మండిపోతున్నారు. ఒక్కొక్కరూ పదిమంది శత్రు సైనికులను మట్టుబెట్టేటంతటి క్రోధావేశంతో రగిలిపోతున్నారు. వారు యుద్ధాన్ని తప్ప, బానిసత్వాన్ని వాంఛించడంలేదు. తమరి పాలనను తప్ప, పరాయి పాలనను కోరుకోవడం లేదు. మహారాజా… తమరు అధైర్యం వీడండి. సమర శంఖం పూరించండి’ అన్నాడు మహామంత్రి.
మహామంత్రి మాటలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి కళింగరాజుకు. ‘మహామంత్రి… రాధాగుప్తుడు యుద్ధతంత్ర నిపుణుడని విన్నాను. అతడి తంత్రాలను, అశోకుడి ఎత్తులను చిత్తుచేసే తగిన యుద్ధవ్యూహాలను సిద్ధం చేయండి’ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా.
—– —— —– —–
సాయంసంధ్యా సమయం. ఆ ప్రాంతం కొద్దిరోజుల ముందు దయానది పరవళ్లతో, పక్షుల కూతలతో, వన్యమగాల అరుపులతో సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల సకిలింపులతో, సైనికుల అరుపులతో గందరగోళంగా ఉంది.
దయానది దిగువ ప్రాంతంలో అశోకుడి సైనిక శిబిరం వద్దకు చేరుకున్నాడు వజ్రమిత్ర. అశోకుడు, కళింగరాజును లొంగిపొమ్మని దూత ద్వారా సందేశం పంపాడు. అందుకు ప్రతిగా గట్టి హెచ్చరిక చేసి రమ్మని తన దూతగా వజ్రమిత్రను పంపించాడు కళింగరాజు.
వజ్రమిత్ర ఓ సైన్యాధికారి వెంట అశోకుడి గుడారం వైపు నడుస్తూనే అక్కడి పరిసరాలను ఓరకంట గమనిస్తున్నాడు. అసంఖ్యాకంగా ఉన్న అశ్వాలూ ఏనుగులూ, ఇసుకేస్తే రాలనంతగా కనిపిస్తున్న సైన్యం, కనుచూపు మేర వరకూ కనిపిస్తున్న లెక్కలేనన్ని గుడారాలూ అతడికి మతిపోగొడుతున్నాయి. వారి ఆయుధ సంపత్తి విస్మయపరుస్తున్నది. వారి బలాన్ని మదిలో అంచనా వేస్తూ ఉండగానే అశోకుడు విడిది చేసిన గుడారం వచ్చింది.
అశోకుడు నగిషీలు చెక్కిన ఆసనం మీద ఠీవిగా ఆశీనుడై ఉన్నాడు. అమూల్య ఆభరణాలు ధరించిన అతడిలో రాజసం ఉట్టి పడుతోంది. చిరునవ్వులు చిందిస్తున్న అతడి కోమలమైన ముఖం, అతడు రాజ్యదాహంతో తన సోదరులను చంపించాడంటే నిజమనిపించనివ్వడం లేదు. కరుణను కురుపిస్తున్న అతడి కళ్లు, అతడో యుద్ధోన్మాది అంటే నమ్మబుద్ది కానివ్వడంలేదు.
వజ్రమిత్ర అశోకుడికి ప్రణామం చేసి ‘మహా రాజా! మా ప్రభులవారి అనుజ్ఞ లేకుండా కళింగ రాజ్యంలోకి చొచ్చుకురావడం న్యాయ సమ్మతం కాదు. తక్షణమే రాజ్యం విడిచి వెళ్లడం తమరికీ, తమరి సైన్యానికీ క్షేమదాయకం. కాదూ కూడదని యుద్ధానికి దిగితే తమరి రాజ్యకాంక్షకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. తమరికిదే అంతిమ యుద్ధమవుతుంది. ఇది మా ప్రభువులవారి హెచ్చరిక!’ అన్నాడు మెత్తగా.
మంత్రి రాధాగుప్తుడు కోపాన్ని అణుచుకుంటూ ‘దూతవని క్షమిస్తున్నా, ఏమిటా పిచ్చి ప్రేలాపనలు? మీ బెదిరింపులకు పారిపోయే కుందేళ్లం కాదు మేం! కళింగ పాలిట యమకింకర్లం! మర్యాదగా కళింగను మా ప్రభువుల వారి పాదాక్రాంతం చేస్తే సరి. లేదా రక్తపుటేర్లు ప్రవహింపజేసి, కళింగను మా హస్తగతం చేసుకుంటాం’ అన్నాడు.
ఆ వెంటనే అశోకుడు చిరుమందహాసంతో ‘మా అశేష సేనావాహినికి భీతిల్లి రాజ్యాలకు రాజ్యాలే మాకు దాసోహమవుతుంటే, మీ ప్రభువు ఏ ధైర్యంతో మాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు’ ఉత్సుకతగా అడిగాడు.
వజ్రమిత్ర తడబాటు లేకుండా ‘మహారాజా! కళింగులు మాతభూమి పరిరక్షణకు కంకణ బద్ధులు… బానిసత్వాన్ని తిరస్కరించే సాహస యోధులు… స్వేచ్ఛకోసం పరితపించే ధీరులు… ఈ లక్షణాలే మా ప్రభువుకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. వారి గుండె ధైర్యం, చావుకు తెరువని మొండిధైర్యం మా ప్రభువును యుద్ధోన్ముఖుడిని చేశాయి. మహారాజా! తమరు వెనుదిరిగితే కళింగులు కతజ్ఞతలు ప్రకటిస్తారు. లేకుంటే సింహస్వప్నా లౌతారు. నిర్ణయం తమరిదే!’ కాస్త ఆవేశంగా అన్నాడు.
అతడి సమాధానం విని అశోకుడు ఒక్కసారిగా ఖిన్నుడైనాడు. రాధాగుప్తుడు ఆశ్చర్యచకితుడైనాడు. వజ్రమిత్ర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమైనాడు.
—– —— —– —–
దయానది ఎగువ ప్రాంతం యుద్ధభూమికి వేదికయింది. ఇరుప్రక్కల లక్షలాది చతురంగబలాలు వారి వారి వ్యూహాల ప్రకారం మోహరించాయి. రథ, గజ, అశ్వ, పదాతి దళాలు చేస్తున్న ఘోషతో అష్ట దిక్కులూ మారు మ్రోగుతున్నాయి. వారి పదఘట్టనలతో రేగుతున్న దుమ్మూ, ధూళీ ఆకాశాన్ని అంటుతున్నాయి.
కళింగరాజు తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఒక భాగాన్ని తన కింద, రెండోవది మహామంత్రి కింద, మూడోవది సర్వసేనాధిపతి కింద ఉంచాడు. వజ్రమిత్రను తన అంగరక్షకుడిగా నియమించాడు. కళింగ సేన యుద్ధభేరి మ్రోగగానే ఉప్పెనలా ఎగిసిపడడానికి సిద్ధంగా ఉన్నారు. తమ స్వేచ్ఛను హరించాలని చూస్తున్న శత్రు సేనను చీల్చి చెండాడాలనే వీరావేశంతో ఉన్నారు. తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న వారి అహం కారాన్ని అంతమొందించాలన్నంత ఆగ్రహంతో ఉన్నారు.
కళింగరాజు తన సేనను ఉద్దేశించి ‘సైనిక యోధుల్లారా! కళింగ పౌరుషాన్ని ప్రదర్శించండి. శత్రుసేనకు ప్రాణభయాన్ని రుచి చూపండి. కళింగులు మహావీరులనీ, సాహసానికి మారు పేరని నిరూపించండి. విజయమో, వీరమరణమో మన చెంతకొచ్చేవరకూ అవిశ్రాంతంగా పోరాడండి’ బిగ్గరగా అన్నాడు.
ఆ వెంటనే వజ్రమిత్ర ఆవేశపూరితంగా ‘స్వేచ్ఛా?… మరణమా?..’ అంటూ గట్టిగా ఎలుగెత్తి అరిచాడు. లక్షలకంఠాలు దిక్కులు పిక్కటిల్లేలా ‘స్వేచ్ఛా?… మరణమా?’ అంటూ మేఘగర్జనలలా నినదించారు.
కళింగసేన రణనినాదం ప్రళయనాదంలా వినిపించి మగధసేనకు గుండెలదిరాయి. భయం అణువణువునా వ్యాపించింది. కొన్ని ఏనుగులూ అశ్వాలూ బెదిరి సైన్యాన్ని తొక్కుకుంటూ వెనక్కి పరుగందుకున్నాయి. యుద్ధం మొదలు కాకుండానే ఆ తొక్కిడిలో నలిగి కొంత సైన్యం యమపురికి చేరుకుంది. దాంతో అశోకుడు క్రోధావేశంతో రగిలిపోతూ యుద్ధభేరి మ్రోగించాడు. అందుకు ప్రతిగా కళింగ భేరీలూ మ్రోగాయి.
ఇరు సైన్యాలు పందెపుకోళ్లులా కలయబడ్డాయి. నెత్తురు చిందడం మొదలైంది. రధికులూ, ఏనుగులపై నున్న హౌడాలులోని ధనుర్ధారులూ శత్రువులపైకి వెదురుబాణాలను సంధిస్తున్నారు. అశ్వికులు తమ కరవాలాలతో శిరస్సులను ఖండిస్తున్నారు. పదాతులు బల్లెలతో గుండెలను చీలుస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతున్నది. ఆ రోజు, ఆ మర్నాడు, ఆ తర్వాతి రోజు… రోజులు కరుగుతున్నా యుద్ధం ఆగడంలేదు. ఎవరిది పైచేయో తెలియడం లేదు. మగధ సైన్యం కండబలాన్ని చూపిస్తోంది. కళింగసైన్యం సాహసాన్ని ప్రదర్శిస్తోంది. ఫలితంగా విజయం ఇరుపక్షాలను ఊరిస్తోంది. భారీగా జరుగుతున్న ప్రాణనష్టం, ధననష్టం భయపెడుతోంది.
ఆ రాత్రి అశోకుడు, తన మంత్రులూ సేనాధి పతులతో సమావేశమయ్యాడు. యుద్ధం సష్టిస్తున్న విధ్వంసం అతడిలో కొత్త తలపులను ప్రోది చేస్తున్నాయి. శాంతిని ప్రేరేపిస్తున్నాయి. అహింసవైపు అడుగులు వేయిస్తున్నాయి. దాంతో అతడు యుద్ధాన్ని ఇంతటితో విరమిద్దామని ప్రకటించాడు. అందుకు అక్కడున్న వారంతా విముఖత చూపారు. అలా చేస్తే మగధ సామ్రాజ్యం, కళింగుల వీరత్వానికి మోకరిల్లి నట్టవుతుందన్నారు. దేదీప్యమానంగా వెలుగొందు తున్న మగధ కీర్తి ప్రతిష్ఠలు మసక బారతాయన్నారు. చివరిగా మంత్రి రాధాగుప్తుడు ‘ప్రభూ! తమరిలో కొత్తగా మొలకెత్తుతున్న ఆ శాంతి మొలకను చిదిమేయండి. లేకపోతే అది మన బలహీనతగా, కళింగులకు వెయ్యేనుగుల బలంగా మారుతుంది. తమరు ఒక్కరోజు ఓపిక పడితే యుద్ధానికి ముగింపు పలుకుతాం. తమరి తండ్రి బిందుసారుడికి దక్కని విజయాన్ని తమరి పాదాక్రాంతం చేస్తాం!’ అన్నాడు నచ్చజెప్పుతూ. దాంతో అశోకుడు అన్యమనస్కంగానే ఊకొట్టాడు.
ఆ మరునాడు యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మగధ సైన్యం తమ మంత్రులూ, సేనాధిపతులు రూపొందించిన వ్యూహం ప్రకారం నడుచుకుంటూ, యుద్ధ నియమాలను గాలికొదులుతూ అధర్మయుద్ధం సాగిస్తున్నారు. దొంగదెబ్బ తీస్తూ మారణ¬మాన్ని సష్టిస్తున్నారు. ఊహించని విధంగా దాడిచేసి దారుణంగా, రాక్షసంగా కళింగులను వధిస్తున్నారు. కళింగులు అది గుర్తించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళింగసేన పూర్తిగా చెల్లాచెదురైంది. చెదిరిన సేనను మట్టుబెట్టడం మగధ సేనకు సునాయాసమైంది.
వ్యూహాత్మకంగా దాడిచేసి కళింగరాజును గాయ పర్చిన మగధ సైన్యాన్ని వీరోచితంగా ఎదురుకున్నాడు వజ్రమిత్ర, కళింగరాజును సురక్షిత ప్రదేశానికి పంపించి, శత్రుమూకపై నెత్తురు రుచి మరిగిన సింహంవలె వీర విహారం చేస్తున్నాడు. అంతలో ఓ సైనికుడు దొంగచాటుగా అతడి అశ్వాన్ని గాయ పర్చాడు. దాంతో అది గట్టిగా సకిలిస్తూ నేలకూలింది. దానితోపాటుగా వజ్రమిత్ర కూడా నేలపై పడ్డాడు. అదే అదునుగా శత్రు సైనికులు కలయబడి అతడి రెండు కాళ్లనూ కర్కశంగా ఖండించారు.
కాలం గడుస్తున్నకొద్దీ యుద్ధం ఏకపక్షమైంది. కళింగసైన్యం పల్చబడింది. మగధ సైన్యం ఉన్మా దుల్లా కనిపించిన కళింగవీరుల శరీర భాగాలను సొరకాయను కోసినట్టు కోశారు. రాజధానిపై, సమీప గ్రామాలపైబడి వద్ధులనీ, స్త్రీలనీ, పిల్లలనీ చూడక నరమేధం సష్టించారు. అందినకాడికి దోచుకున్నారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఎందర్నో యుద్ధఖైదీలుగా బంధించారు. సూర్యాస్తమయానికి యుద్ధాన్ని పరిసమాప్తం చేశారు.
—– —— —– —–
నెమ్మదిగా చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశంలో వందల సంఖ్యలో రాబందులు చక్కర్లు కొడుతున్నాయి. అశోకుడి శిబిరంలో పండుగ వాతావణం నెలకొంది. అందరి ముఖాలలోనూ ఆనందోత్సహాలు వెల్లువిరుస్తున్నాయి. కాని అందుకు విరుద్ధ భావాలు అశోకుడి ముఖంలో ప్రస్ఫుట మవుతున్నాయి. అతడి హదయం పశ్చాత్తాపమనే అగ్నితో దహించుకుపోతోంది. ఆ అగ్నిని చల్లార్చు కోవడం కోసం దయానది వద్దకొచ్చిన అశోకుడు స్థాణువయ్యాడు. దయానది, నీళ్లకు బదులుగా నెత్తురును ప్రవహింపజేస్తున్నది. అశోకుడి మనసు వికలమైంది. వడివడిగా శిబిరానికి తిరిగివచ్చి, అశ్వంపై యుద్ధభూమికి చేరుకున్నాడు.
అశోకుడి చేతిలో ప్రజ్వరిల్లుతున్న దివిటీ అక్కడి భయానక దశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది. ఎక్కడచూసినా శవాల గుట్టలూ, రక్తపు మడుగులు కనిపిస్తున్నాయి. విగత జీవులైన ఏనుగులూ, అశ్వాల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. తెగిపడిన తలలూ, మొండాలూ, కాళ్లూచేతులూ, మాంసపు ముద్దలతో అక్కడ మత్యువు రాజ్యమేలుతున్నట్లుంది. క్షతగాత్రుల ఏడుపులు, కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారి మూలుగులు హదయాన్ని మెలితిప్పుతున్నాయి. యుద్ధభూమి భయోద్విగ్నంగా, బీభత్సంగా, జుగుప్సాకరంగా ఉంది.
శవాలనూ, క్షతగాత్రులను తప్పించుకుంటూ అశ్వాన్ని ముందుకు పోనివ్వడం అశోకుడికి కష్టమైపోయింది. శవాలను పీక్కుతింటున్న క్రూర మగాలను చూసి గుండె నీరైపోయింది. అతడిలో ఆత్మశోధన ప్రారంభమయింది.
ఎన్నడూ కనీవినీ ఎరుగని ఇంతటి అమానుష కాండ నా ఒక్కడి వల్లనే జరిగిందా? నేనేనా ఈ ఘోరకళికీ, జన విధ్వంసానికి కారణమూ? స్వేచ్ఛా స్వతంత్రాల కోసం సాహసమనే ఆయుధాన్ని పట్టిన కళింగుల మీదా నా శౌర్య పరాక్రమాలను ప్రదర్శిం చింది? ఒక వ్యక్తి రాజ్యకాంక్ష, యుద్ధదాహమూ ఇంతటి వినాశనాన్ని సష్టిస్తుందా? ఇందరి ప్రాణాలనూ, క్షతగాత్రులనూ కోరుకుంటుందా? శోకమే ఎరుగని అశోకుడు శోకసంద్రమే అయ్యాడు.
రక్తపు మడుగులో, చావుకు చేరువలో ఉన్న వజ్రమిత్ర, తన సమీపంలోకి వచ్చిన అశోకుడిని చూశాడు. చిన్నగా మూలిగాడు. అశోకుడు కళింగ దూతను గుర్తుపట్టాడు. ఒక వీరుడి దీనస్థితికి చలించిపోయాడు.
‘మహారాజా! దివిటీ వెలుగులో తమరు పారేసుకున్న దేనినో శవాల గుట్టల మీద గాలిస్తు న్నారు. ఒకవేళ మానవత్వాన్నీ, శాంతిని కాదు కదా? అవే అయ్యింటే, అవి ఇక్కడెందుకు దొరుకు తాయి మహారాజా.. తమరి హృదయాంతరాలలో వెదకండి. తప్పక దొరుకుతాయి. అప్పుడు కళింగుల సాహస గాధ తమకో గుణపాఠమవుతుంది. ఈ కళింగ యుద్ధమే తమరికి అంతిమ యుద్ధమవుతుంది. గౌతమబుద్ధుడి శాంతి ప్రభోదమే ఆయుధమవుతుంది’ అంటూ వజ్రమిత్ర తుదిశ్వాస వదిలాడు.
అశోకుడు పశ్చాత్తాపంతో అక్కడ్నుంచి కదిలాడు. వజ్రమిత్ర మాటలు పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అమర వీరులైన కళింగుల ముఖాలలో పౌరుషాగ్ని జ్వాలలు ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. అవి అతడిలోని కామక్రోధమదమాత్స ర్యాలను దహిస్తున్నాయి. అతడిలోకి ప్రేమ, కారుణ్యాలను ప్రవేశపెడుతున్నాయి.
అశోకుడు… కళింగుల ఆత్మార్పణకూ, సాహసానికి జోహార్లు అర్పిస్తూ… యుద్ధాలకు చరమగీతం పాడుతూ… శాంతికి, అహింసకు హదయ కవాటాలను తెరుస్తూ… నవోదయానికి స్వాగతం పలుకుతూ… ముందుకు సాగుతున్నాడు.
(చరిత్రలో నిజంగా జరిగిన కళింగ యుద్ధ నేపథ్యంలో అశోకుడి సేనను, కళింగులు ఏ విధంగా ఎదిరించి ఉంటారో ఊహించి రాసిన కల్పిత కథ. ఈ కథలోని పలు సంఘటనలు, ప్రదేశాలు వాస్తవాలు. అశోకుడు, రాధాగుప్తుడు, బిందుసారుడు, సుసీముడు పేర్లు వాస్తవాలు. కళింగరాజు పేరు చరిత్రలో అలభ్యం. మిగిలిన పేర్లన్నీ కల్పితాలే)
– బోడ్డేడ బలరామస్వామి

శ్రీకాళింగము-శ్రీకాకుళము

Historical Srikakulam & Uttarandhra Places:

సుదీర్ఘ సముద్రతీరం.. అపారమైన ప్రకృతి వనరులు... క్రీస్తుపూర్వం నాటి ఘనమైన చరిత్ర.. అతి ప్రాచీన... అత్యంత అరుదైన దేవాలయాలు...
బౌద్ధారామ క్షేత్రాలు.. ఇదీ శ్రీకాకుళం జిల్లా స్వరూపం ~~~~
ఇదో అందమైన వూటీ... పేదల వూటీ... వేసవిలోనూ చల్లదనం చూపించే జిల్లా ఇది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల సాగర సంగమ ప్రదేశాలు మనసును పరవశింపచేస్తాయి.
మరో కోనసీమను తలపించే ఉద్దానం.. నిజంగా స్వర్గధామమే. శాలిహుండం, కళింగపట్నం, దంతవరపు కోట ఆనాటి కళింగ ప్రజల శాంతికాముకత్వానికి ప్రతీకలుగా నిలిచాయి.
శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న సూర్యదేవాలయం, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుడి ఆలయం, దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర, మధుకేశ్వర దేవాలయాలు, ఒకనాడు పాండవులు నివసించిన తూర్పు కనుమల్లోనే ఎత్తైన శిఖరాలుగా పేరుగాంచిన మహేంద్రగిరులు...
విదేశీ విహంగాలకు ఆటపట్టయిన తేలినీలాపురం, తేలుకుంచి, ప్రాచీన కాలంలో ఓడరేవులుగా విలసిల్లిన కళింగపట్నం, బారువలు శ్రీకాకుళం జిల్లాలోని విభిన్న కోణాలను స్పృశిస్తాయి.
శతాబ్దాల చరిత-చిక్కోలు ఘనత-
ప్రాచీనకాలంలోనే శ్రీకాకుళం ఉందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అయితే 1950లో జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు.
కళింగ చరిత్ర ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతం, కథా సరిత్సాగరం, మొదలైన గ్రంథాలలో ప్రస్తావించారు. పూర్వదశలోనే ఈ ప్రాంతంలో ఆదిమ తెగలతో కూడుకున్న జనజీవనం ఉన్నట్టుగా కంభంపాటి సత్యనారాయణ ఆంధ్రుల సంస్కృతి-చరిత్రలో పేర్కొన్నారు. శబ్దకల్ప ద్రుమంలో కలి+గయ్‌+డ అని కళింగ ఉత్పత్తి పేర్కొన్నారు. వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి ‘కళింగ’ ప్రదేశమని వచ్చిందని కళింగ చరిత్రలో వివరించారు.
‘రామాయణం’లో అయోధ్యకాండలో భరతుడు కేకేయరాజును వదిలి అయోధ్యకు వచ్చేటప్పుడు కళింగనగరం మీదుగా ప్రయాణించాడని చెప్పినట్టు ప్రాచీన చరిత్ర-భూగోళంలో పేర్కొన్నారు.
ఈ ప్రాంతానికి సంబంధించి అయోధ్యకు పశ్చిమంగా కళింగనగరం ఉన్నట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది. భారతంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో భ్రాతృభిస్సహితో వీరఃకలింగాన్‌ ప్రతిభావతి అని చెప్పిన దాని ప్రకారం అప్పటికే ఈ కళింగ ప్రాంతం ఉన్నట్టు తెలుస్తోంది. దీర్ఘతమనుడు అనే రుషిని కాళ్ళు, చేతులు కట్టి అతని శిష్యులు గంగలో వదిలివేశారు.
అతడు నీటిలో కొట్టుకురాగా ‘బిలి’ అనే రాజు అతనిని ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ చేసి తన భార్యతో సంతానాన్ని కనాలని కోరడంతో ఆ రుషి ఆమె ద్వారా ‘అంగుడు’, ‘వంగడు’ ‘కళింగుడు’, ‘సహ్ముడు’ అనే పుత్రులను కన్నాడని ఆ పుత్రుల వల్ల వారి పేర్ల మీదుగా రాజ్యాలు ఏర్పడ్డాయని మహాభారతంలో ఉంది.
దండి రాసిన దశకుమార చరిత్రలో కళింగ దేశం, కళింగనగరంగా పేర్కొన్నారు. మార్కండేయ పురాణం, వాయు పురాణం, కాళిదాసు రఘువంశంలో కూడా ‘కళింగం’ ఉనికిని ప్రస్తావించారు.
మన్మోహన్‌ గంగూలీ ‘ఒరిస్సా దాని చిహ్నములు’ అనే గ్రంథంలో కాళింగమునకు ఉత్తరమున వైతరణి నది, దక్షిణాన గోదావరి, తూర్పున సముద్రం, పశ్రిమాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ కళింగం అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. కళింగ ప్రాంతాన్ని గురించి శ్రీముఖలింగంలో లభించిన శాసనాలు, శక్తివర్మ రాగోలు శాసనాలలో మనకు మరింత సమాచారం దొరుకుతుంది.
బ్రిటీషుపాలనలో ఉన్నప్పుడు గోదావరి నది వరకు ఉన్న ఈప్రాంతమంతా ఒరిస్సాగా పిలువబడేది, ఆ సమయములో [క్రీ.శ.1857 నుంచి 1890మధ్య], 80 కి పైగా తామ్ర శాసనాలు[Copper Plates] ఒరిస్సాలోని భువనేశ్వరము వద్దగల "కళింగనగర్" లో పొందుపరుచబడినాయి. ఇందుముఖ్యమైన దక్షిణ కళింగము లేదా నేడు ఉత్రరాంధ్రగా పిలువబడుతున్న శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్టణము, తూర్పుగోదావరి జిల్లా లకు చెందిన 80 తామ్రశాసనాలు Orissa Inscriptions పేరున ఉన్నాయి.
ఇందు ముఖ్యమైనవి కొన్ని: శ్రీముఖలింగము శాసనము, కొర్ని శాసనము, పాతటెక్కలి శాసనము, గార శాసనము, వైజాగపటము శాసనము మొదలైనవెన్నో ఒరిస్సా కళింగనగర్లోనే ఉంచబడినాయి.
శ్రీకాకుళముజిల్లాకు చెందిన క్రీ.శ. 1026 నాటి చినబాడము, నందబలగ తామ్ర శాసనాలు[Copper Plates] రెండున్నూ ఆంధ్రవిశ్వవిద్యాలయము చరిత్రవిభాగము[Archaelogy]లో 1960 లలో నిక్షిప్తము చేయబడ్డాయి.
ఈ శాసనాల పరంగా పరికిస్తే జిల్లా అతిప్రాచీనమైనదని అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో క్రీ.పూ. నాల్గవ శతాబ్దం నాటికే కళింగ రాజ్యం కటక్‌ నుంచి పిఠాపురం వరకు వ్యాపించి ఉంది. అప్పటి నుంచి 15వ శతాబ్దం వరకు అనేక మంది రాజులు, దండయాత్రలు జరిపి తమ తమ రాజ్యాలను స్థాపించారు.
మహ్మదీయ పాలనలో కూడా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలానుగుణంగా కళింగ రాజ్యం ఉత్తర భాగం ఒరిస్సాలోను, దక్షిణభాగం ఆంధ్రలోను అంతర్భాగం అయ్యాయి. క్రీ.పూ. 467 నుంచి 336 వరకు అనగా మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
కళింగ దేశంపై దాడి చేసిన అశోకుడు చారిత్రక కళింగయుద్ధములో, లక్షలాది కాళింగ వీరుల రక్తపుటేరులను చూసి, క్రీ.పూ. 225లో పశ్చాత్తాపం పొంది బౌద్ధమతాన్ని ఈ ప్రాంతంలోనే స్వీకరించాడు. గంగరాజుల పాలనలో బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. జిల్లాలో ఈ మతాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు శాలిహుండం, కళింగపట్నం, మహేంద్రగిరి, దంతవరపుకోట, సంగమయ్యకొండ మొదలైన ప్రదేశాలున్నాయి.
భువనేశ్వరము ఉదయగిరిలో ఖారవేలుని చే వ్రాయించబడిన హథిగుంపశాసనము ముఖ్యమైనది.
మౌర్య సామ్రాజ్యం పతనము చేసి, క్రీ.శ. 183లో ఖారవేలుడు శ్రీముఖలింగం రాజధానిగా తిరిగి కళింగ రాజ్యాన్ని స్థాపించాడు. 7వ శతాబ్దం వచ్చినంత వరకు కళింగ రాజధాని ముఖలింగంగానే పరిగణింపబడింది. ఖారవేలుని కాలములో శ్రీముఖలింగము ప్రముఖ జైన దేవాలయము, తదుపరి అది శైవాలయముగా మార్చబడింది
కళింగ ఖారవేలుని తరువాత ఆంధ్ర చక్రవర్తులైన శాతవాహనులు, కళింగదేశాన్ని జయించారు. శాతవాహనుల తరువాత కళింగ రాజ్యం విచ్ఛిన్నమై చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి. క్రీ.శ. 343లో సముద్రగుప్తుడు దండెత్తి వచ్చిన కాలంలో కళింగదేశాన్ని నలుగురు రాజులు పరిపాలిస్తున్నారు. నాటి వాసిష్ఠులకు రాజధాని పిఠాపురమే.
శాలంకాయనుల ధాటికి తాళలేక శ్రీకాకుళం దగ్గర ఉన్న ‘సింగుపురానికి’ ఆ తర్వాత టెక్కలి వద్ద ఉన్న ‘వర్దమానపురానికి’ అక్కడ నుంచి పొందూరు వద్ద నున్న ‘సిరిపురానికి’ రాజధానులను మార్చుకున్నారు.
క్రీ.శ. 485లో విష్ణుకుండినులు దక్షిణ కళింగాన్ని జయించారు. శ్రీకాకుళం స్టేషన్‌కు సమీపంలో ఉన్న మునగాలవలస పక్కన ఉన్న ‘పురుషోత్తపురం’ దగ్గరున్న దంతపురాన్ని గంగ ప్రాంతము నుంచి వచ్చిన గాంగరాజులు రాజధానిగా చేసుకుని పరిపాలించారు.
అప్పటినుంచి క్రీ.శ. 1434లో ప్రతాపరుద్ర గజపతి పరిపాలనకు వచ్చినంత వరకు గంగరాజులే పరిపాలించారు.
గౌతమి బుద్ధుడు క్రీ.పూ. 483లో మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిపించి ఆయన శరీర అవశేషాలను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయారు.
బుద్ధుని నోటిలోని ఒక దంతాన్ని ఖేమరుసి అనే వ్యక్తి తీసుకువచ్చి కళింగరాజుల్లో ఒకడైన బ్రహ్మదత్తుని కాలంలో నరేంద్రపురం కోటలో పదిలపర్చాడు. క్రమంగా ఇక్కడ ఒక స్థూపం కూడా నిర్మితమై ఎన్నో పూజలందుకుంది. ఇదే కాలక్రమంలో దంతకోట, దంతపురంగా [శ్రీకాకుళము దగ్గరలోని నేటి "దంత"] మారిందని చెబుతారు. అది తదనంతరము కాళింగ ఆడపడుచుల ద్వారా కళింగ ఏలుబడిలోనున్న సింహళము[నేటి శ్రీలంక]కు తీసుకువెళ్లబడింది.
సింహళము[Ceylon] పేరు మరియు సింగపూర్ [Singapore] దేశము పేర్లు క్రీస్తు పూర్వము 5,6 శతాబ్దములలో సింహపురము [నేటి Srikakuam జిల్లాలోని సింగుపురము] పాలించిన "కళింగ సింహబాహు"ని వలననే , ఆయన కుమారుడు కళింగవిజయబాహు"ని సింహళదేశ పాలన, ప్రాబల్యము వలననే పిలువబడుతున్నాయి.
కళింగుల నావికా సమరప్రావీణ్యమునకు ప్రతీక కళింగపట్నము రేవు. వీరి ప్రాబల్యము తామ్రలిప్తి మొదలుకొని సింహళము, సింగపూర్, ఇండోనేషియా "బాలి"ద్వీపము వరకు వ్యాపించియున్నది.
బలి చక్రవర్తి సంతానమైన కళింగుడు, కళింగులు తమ వంశమూలపురుషుని పేరునే తమ పాలనలో "బలి" లేదా ""బాలి" [BALI] ద్వీపముగా పిలుచు చున్నారు. ఇండోనేషియాలో కళింగ ప్రోవిన్సు [Kalinga Province] ఉన్నది. అక్కడ గౌడ కళింగ
(GAWAD KALINGA) అని పిలువ బడుతున్నారు. కళింగుల మూలాలు గంగానదీపరివాహకము లోని గౌడదేశప్రాంతానివి.
గంగరాజులు కళింగాన్ని సుదీర్ఘమైన కాలం పరిపాలించారు. ఒక దశాబ్దం వరకు ‘ముఖలింగం’ రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత కటకానికి రాజధానిని మార్చారు. వీరి హయాంలో శ్రీముఖలింగం, నగరికటకం అద్భుత నగరాలుగా ఉండేవి. శ్రీముఖలింగ ఆలయాలు వీరు నిర్మించినవే.
ఆనాటి సామాజిక జీవన స్థితిగతులు ముఖలింగం శిల్పాల్లో కనిపిస్తాయి. గంగ వంశానికి చెందిన 50 మంది రాజులు పరిపాలించినట్టు చరిత్రకారులు గుర్తించారు. వీరి శాసనాలు జర్జంగి, శ్రీకాకుళం, ఉర్లాం, అచ్యుతాపురం, సంతబొమ్మాళి, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
శ్రీముఖలింగం ఆలయంలోనే 149 శాసనాలున్నాయి. గంగరాజుల్లో ఒకడైన రెండవ వజ్రహస్త దేవుని శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వంశంలో చివరివాడు భానుదేవుడు.
గంగ వంశ పతనంతో ఆంధ్రదేశం మూడుభాగాలుగా విడిపోయింది. ఉత్తర కళింగాన్ని, క్రీ.శ. 1344లో పాలించిన కపిలేశ్వర గజపతికి ‘కటకం’ రాజధానిగా మారింది. అతని కుమారుడు పురుషోత్తమ గజపతి కళింగాన్ని జయించాడు.
ఉత్తర కళింగము ‘ఉత్కళం’గా మారిందని భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఇతని కుమారుడు ప్రతాపరుద్రుని కాలంలో శ్రీకృష్ణ దేవరాయులు దండయాత్ర చేసి కళింగ సామ్రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నేటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఆ ‘నందపురం’లోనే ఉండేవి.
పర్లాకిమిడి రాజులు ఈ కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, మందస, నరసన్నపేట ప్రాంతాలను ఆక్రమించారు. జలంతరకోట, ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలు పాత్రునుల ఆధీనంలో ఉండిపోగా శ్రీకాకుళం, బొంతలకోడూరు ప్రాంతం మహ్మదీయ ప్రాబల్యంలోకి వెళ్లిపోయాయి.
నందవంశంలో క్రీ.శ.1752-58 కాలంలో లాలాకృష్ణుడు, విక్రమ్‌దేవ్‌ల మధ్యన పోరు జరిగి రాజ్యం విచ్ఛిన్నమైంది. నేటి ఒరిస్సా, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ‘జామీలు’గా ఏర్పడ్డాయి. పాలకొండ, వీరఘట్టాం కొత్త రాజ్యాలుగా అవతరించాయి. ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని విజయనగరరాజు విజయరామరాజు విక్రమదేవునికి అండగా నిలిచి సాలూరు, కురుపాం, తదితర రాజ్యాలు పొందినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఔరంగజేబు గోల్కొండ నవాబును ఓడించి, నిజాం ఉల్‌ముల్క్‌ని తన ప్రతినిధిగా నియమించగా, ఔరంగజేబు మరణానంతరం నిజాం స్వతంత్రత ప్రకటించుకున్నాడు. అతని పరిపాలనలోనే ఆంధ్రప్రాంతం అయిదు సర్కారులుగా ముక్కలైంది.
నిజాం రాజు మరణానంతరం వారసత్వం కోసం చెలరేగిన అంతఃకలహాల్లో సలాబత్‌సింగ్‌ ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సహాయాన్ని కోరాడు. దీనితో శ్రీకాకుళం సర్కార్‌ నుంచి కొండపల్లి సర్కార్‌ వరకు నాలుగు సర్కారులను ఫ్రెంచివారు తమ సైనిక ఖర్చుల కింద రాయించుకున్నారు.
దీనివలన నైజాం ప్రతినిధి అయిన జార్‌ అలీ మహారాష్ట్రుల సహాయం కోరాడు. మహారాష్ట్ర సైనికులు చికాకోల్‌, విశాఖ, గోదావరి ప్రాంతాలను వశం చేసుకున్నారు. వారు వెళ్లిన తరువాత నిస్సహాయుడైన జాఫర్‌ అలీ మరణించాడు.క్రీ.శ. 1754లో చికాకోల్‌ ‘సుబా’ ఫ్రెంచివారి ఆధీనమైంది
విజయరామరాజు కోసం బొబ్బిలినిక్రీ.శ. 1757 జనవరి 26న ఫ్రెంచి సేనలు చుట్టుముట్టాయి. ఇతని హత్య తర్వాత రాజైన ఆనందగజపతి ఇంగ్లిషు వారితో చేతులు కలిపాడు. క్రీ.శ.1758లో ఇంగ్లిషు సైన్యం వచ్చింది. క్రీ.శ.1759లో ‘చికాకోల్‌’లో ‘ఫౌజ్‌దార్‌’ల పాలన అంతమైంది.
క్రీ.శ.1760లో ఆనందగజపతి చనిపోగా 1766లో ఈస్టిండియా పాలన ప్రారంభమైంది. అప్పటికి పాలకొండ, టెక్కలి మొదలైన జమిందారీలు ఉన్నాయి. 1778లో బ్రిటిష్‌వారితో జమిందారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రీ.శ.1801 నుంచి కలెక్టర్ల నియామకం ప్రారంభమైంది. 1816 నుంచి జిల్లా కలెక్టర్‌కు మెజిస్ట్రేట్‌ అధికారాలు లభించాయి.
జమీందారీ విధానాన్ని ఎదిరించిన గంజాం, విశాఖ జిల్లాల రైతుల వల్ల ‘అచ్చపువలస’ దగ్గర గిరిజన పితూరీ జరిగింది. ఈ గ్రామం వీరఘట్టాం దగ్గర ఉంది.క్రీ.శ. 1834లో గిరిజన తెగలకు చెందిన పాలకొండ, మేరంగి, కురుపాం, మొండెంఖల్‌లలో జమీందార్ల దోపిడీ ఎక్కువైంది. బ్రిటిష్‌వారు శ్రీకాకుళం, కశింకోటలను విశాఖలో విలీనం చేశారు.
ఇచ్ఛాపురాన్ని పాతగంజాంలో 1902లో కలిపారు.క్రీ.శ. 1902-1930 మధ్యలో జమీందారులు విపరీతంగా శిస్తులను పెంచారు. జమిందార్ల వ్యతిరేక పోరాటానికి 1940లో పలాసలో జరిగిన 2వ అఖిల భారత రైతు మహాసభ స్ఫూర్తినిచ్చింది. మందసలో జరిగిన రైతాంగ పోరాటంలో సాసుమాను గున్నమ్మ వీరమరణము చెందింది
క్రీ.శ.1948లో జమిందారీలను రద్దు చేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దానితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన సమావేశంలో [ఒరిస్సా రాష్ట్రములో మొదట ఉన్నప్పుడు గంజాము జిల్లా దక్షిణభాగముగాను, తదనంతరము మద్రాసు రాష్ట్రములో ఉన్నప్పుడు ఉత్తర విశాఖగాను పిలువబడే నేటి శ్రీకాకుళము ప్రాంతము] శ్రీకాకుళం షేక్‌అహ్మద్‌ కలెక్టర్‌గా నియమితులవడంతో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.
ఆనాడు పార్వతీపురము, బొబ్బిలి, గరివిడి 1978 లో విజయనగరము జిల్లా ప్రత్యేకముగా ఏర్పడేవరకూ శ్రీకాకుళము జిల్లాలోనే ఉండేవి.
ఇతర విశేషాలు....
జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళానికి చేరువలోనున్న విమానాశ్రయం విశాఖపట్నం. సమీపంలోని రైల్వేస్టేషన్‌ ఆమదాలవలస స్టేషన్‌. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీకాకుళం పట్టణంలో ప్రాచీన ఆలయాల్లో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం ఒకటి. ఏకాంత గణపతి పర్వతాకారులైన నందీశ్వరునితో అలరారుతోంది. ఈ ఆలయంలో 16, 17 శతాబ్దాల శాసనాలు లభించాయి. 
  

Friday 15 June 2012

KALINGA POLITICAL LEADERS

 కళింగుల నుండి చట్ట సభలకు ఎన్నికైన వారు 

వీరిలో శాఖలు వున్నా చట్ట సభలు కు మాత్రం అందరు కలిసి కట్టు గ పంపిస్తారు

 కళింగుల నుండి మొట్ట మొదట సర్ అన్నెపు పరుసురం పాత్రో  Madras Legislative Council కు ఎన్నికై  Minister of Public Works and Education  1921 నుండి   1926 వరకు పని చేసారు .  1937లో ఒరిస్సా legislative council కు ఎన్నికై speaker గ కొద్దికాలం పనిచేసారు, andhrauniversity స్తాపన కై పాత్రో గారు ఎంతో కృషి చేసారు ఈయన బరంపురం దరి లంగినపల్లే లో జన్మించారు అటు తరువాత భారత దేశానికీ స్వాతంత్రం వచ్చి రాష్ట్ర విభజన జరిగిన తరువాత వీరి నుండి ప్రజాప్రతి నిధులు గ ఎన్నికైన వారు


lokshabha కు ఎన్నికైన వారు

బొడ్డేపల్లి రాజగోపాలరావు(INC ) - 6 సార్లు (1,2,3,5,6,7 lokshaba elections లో విజయం సాదించారు-30 సంవత్సరాలు  )
హనుమంతు అప్పయ్య దొర(TDP ) -1 సరి(8 lokshabha 1984-89)
కనితి విశ్వనాధం(INC )-2 సార్లు(9&10 loshaba 1989-91 &1991-96)
killi  kruparani(INC ) -15 th lokshaba (2009 నుండి కోన సాగుతున్నారు)


రాజ్య సభకు ఎన్నికైన వారు 

మజ్జి తులసి దాస్  -ఈయన pcc chief  గ కూడా పని చేసారు 

MLC లు గ పని చేసిన వారు 

మార్పు బాలక్రిష్ణమ్మ - ఈ యన aptf  నుండి రెండు సార్లు(12 years ) MLC  గ పని చేసారు
మజ్జి శారద -ఈవిడ కాంగ్రెస్ నుండి MLC గ  nominate అయ్యారు
ఇంకా ఒకరిద్దరు MLC లు గ పని చేసారు నా వద్ద స్పష్టమైన డేటా లేదు

జిల్లా పరిషద్ చైర్మన్ లు గ పని చేసిన వారు 

శ్రీకాకుళం జిల్లా పరిషద్ మొట్ట మొదటి చైర్మన్ గ  బెండి కుర్మన్న పని చేసారు వీరి తరువాత ఈ కులం నుండి ఇంకా మరి ఎవ్వరు జిల్లా పరిచాద్ చైర్మన్ గ పని చెయ్య లేదు,
పలువురు vice చైర్మన్ లు గ పని చేసారు వారిలో కొందరు
చౌదరి బాబ్జి , దువ్వాడ శ్రీనివాస్, మార్పు ధర్మారావు వంటి వారు
ప్రస్తుతం చౌదరి . ధనలక్ష్మి (2014 నుండి కొనసాగుతున్నారు )

మున్సిపల్ చైర్మన్ లు గ పని చేసినవారు 

కోత పూర్ణచంద్రరావు (పలాస మున్సిపల్ చైర్మన్ గ ప్రస్తుతం కొనసాగుతున్నారు (2014 నుండి )
తమ్మినేని గీత (ఆముదాలవలస 2014 నుండి కొనసాగుతున్నారు)
బొడ్డేపల్లి సత్యవతి & బొడ్డేపల్లి రమేష్ ( ఆముదాలవలస)
వజ్జ బాబురావు ( పలాస)
ఇంకా పలువురు వార్డు కౌన్సిలర్ లు గ  ఈ రెండు muncipality  ల లోనే కాకుండా శ్రీకాకుళం & వైజాగ్ muncipality ల లో కౌన్సిలర్  లు గ  పని చేసారు 
ఇంకా MPP & ZPTC  లు గ చాల మంది ఎన్ని క అయ్యారు,మండల, పంచాయత్ స్తా యీ ల లో కూడా విజయ కేతనం ఎగుర వేస్తున్నారు
మంత్రులు గ తమ్మినేని సీతారాం, చిగిలిపల్లి శ్యామల రావు వంటి వారు పని చేసారు 


MLA లు గ ఎన్నికైన వారు 

YEAR
CONSTITUENCY
CANDIDATE
PARTY
1951
Srikakulam
Killi Appalanaidu
KLP
Narasannapeta
H Satyanarayana Dora
INC
1955
Palakonda
Pydi Narasimapparao
IND
SM Puram
Choudari Satyanarayana
KLP
Nagarikatakam
Tammineni Paparao
INC
1962
Brahmanatarla
Bendi Laxminarayanamma
INC
Tekkali
Ronanki Satyanarayana
SWA
Nagarikatakam
Tammineni Paparao
INC
1967
Nagarikatakam
Tammineni Paparao
INC
Ponduru
Choudari Satyanarayana
SWA
1972
Sompeta
Majji Tulasidas
INC
Tekkali
Sattaru Lokanadam Naidu
INC
Nagarikatakam
Pydi Sreerammurthy
INC
1978
Itchapuram
Bendalam V Sharma
JNP
Tekkali
Bammidi Narayanasamy
JNP
Amadalavalasa
Pydi Sreerammurthy
INC
Cheepurupalli
Chigilapalli Shyamalarao
INC(I)
1983
Sompeta
Majji Narayanarao
INC
Tekkali
Attada Janardhanarao
IND(TDP)
Amadalavalasa
Tammineni Seetharam
IND(TDP)
1985
Amadalavalasa
Tammineni Seetharam
TDP
1989
Tekkali
Duvvada Nagavali
TDP
Amadalavalasa
Pydi Sreerammurthy
Inc
1991
Amdvalasa(Bye elect)
Tammineni Seetharam
TDP
1994
Amadalavalasa
Tammineni Seetharam
TDP
1996
Tekkali(Bye election)
Hanumanthu Appayyadora
TDP
1999
Tekkali
Korla Revathipathi
TDP
Amadalavalasa
Tammineni Seetharam
TDP
2004
Tekkali
Hanumanthu Appayyadora
INC
Amadalavalasa
Boddepalli Satyavathi
INC
2009
Itchapuram
Piriya Sairaj
TDP
Tekkali
Korla Revathipathi
INC
Amadalavalasa
Boddepalli Satyavathi
INC
Tekkali(Bye election)
Korla Bharathi
INC
2014
Itchapuram
Bendalam Ashok
TDP








Amadalavalasa
Kuna Ravikumar
TDP